
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
బ్రహ్మంగారిమఠం : ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయాల పాలయ్యారు. బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలోని బి.మఠం – మిట్టమానుపల్లె రోడ్డులో ఈశ్వరీదేవి గృహ సమీపాన స్కూటర్ ప్రమాదంలో బి.మఠంకు చెందిన లక్షుమయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. మైదుకూరు మండలం అక్కులాయపల్లెకు చెందిన లక్షుమయ్య గతంలో ఈశ్వరీదేవి మఠంలో కొంత కాలం అటెండర్గా పని చేశాడు. మఠంలో నివాసం ఉంటున్నాడు. ఆయన అక్కులాయపల్లెకు వెళ్లి టీవీఎస్ మోపెడ్ మోటార్ సైకిల్పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. స్కూటర్ను ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేక కింద పడి ప్రమాదానికి గురయ్యాడా తెలియాల్సి ఉంది. బాధితుడిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు.
ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని..
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని కుర్నూతల గ్రామం అగ్రహారం వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుర్నూతుల గ్రామం డియ్యాలవాండ్లపల్లికి చెందిన జై భరత్రెడ్డి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. అగ్రహారం వద్ద ఎదురుగా వస్తున్న కొయ్యల ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో జై భరత్ రెడ్డితోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న నాగయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. బాధితులను వెంటనే లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం రాయచోటిలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వారిని తిరుపతికి తరలించినట్లు బంధువులు తెలిపారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు