
నిబంధనాలు
● సజావుగా సాగని రిజిస్ట్రేషన్లు
● స్లాట్ బుకింగ్తో ఆటంకాలు
● సతాయిస్తున్న సర్వర్ సమస్య
● క్రయవిక్రయదారులకు ఇక్కట్లు
● ప్రభుత్వ తీరుపై అసహనం
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రభుత్వానికి రోజూ రిజిస్ట్రేషన్ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. అయితే కూటమి సర్కార్ రోజుకొక కొత్త నిబంధన తీసుకు వస్తుండటంతో రిజిస్ట్రేషన్లు సజావుగా సాగకపోగా, వ్యయ ప్రయాసలు తప్పడం లేదు. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం 2.0 విధానం తీసుకొచ్చింది. దాని తర్వాత స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకు రావడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తొలుత సర్వర్ సరిగా పనిచేయక రిజిస్ట్రేషన్కు తరచూ ఆటంకాలు కలుగుతుండటంతో.. క్రయ విక్రయదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సర్వర్ సమస్య, మరోవైపు ఇంటర్నెట్ సరిగా పని చేయకపోవడంతో గంటల కొద్దీ ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
కడపలో ప్రధాన అర్బన్ కార్యాలయంతోపాటు రూరల్ కార్యాలయం ఉంది. వీటితోపాటు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులి వెందుల, ముద్దనూరు, ఎర్రగుంట్ల, వేంపల్లె, కమలాపురం, సిద్దవటం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరులో నిత్యం క్రయ విక్రయదారుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట కడప అర్బన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానా న్ని అమలు చేశారు. ఆ తర్వాత జిల్లాలోని మిగి లిన అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఈ విధా నం అమలులోకి వచ్చినప్పటికీ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తమ రిజిస్ట్రేషన్ కోసం తొలుత స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి.. కచ్చితంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకోవాలి. ఆ సమయానికి వెళ్లకపోతే తిరిగి స్లాట్ బుక్ చేసుకోవా ల్సి వస్తోంది. ఈ కారణంగా సుదూర ప్రాంతాల ను ంచి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రతి రోజు ఒకరిద్దరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్ సర్కార్ హయాంలో రోజుకు ఒక్కొక్క కార్యాలయంలో 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ప్రస్తుతం స్లాట్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత 39 రిజిస్ట్రేషన్లు మాత్ర మే చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి పడుతోంది.
ఆధార్, పాన్ కార్డు తప్పనిసరి
ప్రస్తుతం రిజిస్ట్రేషన్కు సంబంధించి క్రయ విక్రయదారులు ఇరువురు ఆధార్, పాన్కార్డులను కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయా కార్డుల్లో జన్మదిన తేదీ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కొంత మంది క్రయ విక్రయదారులకు పాన్కార్డు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లకు అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. ఏ దస్తావేజుకై నా కక్షిదారులు తప్పనిసరిగా పాన్కార్డు ఉంటేనే.. రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వానికి ప్రతి రోజు కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే శాఖపైనే సంబంధిత అధికారులు ఆంక్షలు విధిస్తుండటంతో ప్రజలు మండిపడుతున్నారు. పాన్ కార్డు తప్పనిసరి కావడం వల్ల అమ్మకం, కొనుగోలుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కూటమి వచ్చాక కష్టాలు అధికం
రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ వచ్చాక కష్టాలు అధికమయ్యాయి. క్రయ విక్రయదారులకు పాన్కార్డు ఉండాలన్న నిబంధనలతో తీవ్ర సమస్యగా మారింది. అలాగే శ్లాట్ బుకింగ్ విధానంతో కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
– డేనియల్, కడప

నిబంధనాలు

నిబంధనాలు