
సారూ.. సమస్యలు తీర్చరూ..
కడప సెవెన్రోడ్స్: సారూ.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ కార్యాలయంలోని సభా భవనంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్సెల్లో వారు వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జిల్లా అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక్కడికి వచ్చామని, మీరైనా కష్టాలు తీర్చాలని కోరారు. వారిలోని కొందరి సమస్యలు ఇలా ఉన్నాయి.
● భూ రీ సర్వే అనంతరం కొత్తగా 1బీ అడంగల్లో ఇనాం అనే పేరు చేర్చడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె గ్రామానికి చెందిన రైతు జాగృతి సంఘం అధ్యక్షుడు జి.మనోసాగర్రెడ్డి తెలిపారు. అందువల్ల రైతులు భూమిని అమ్ముకోలేకపోతున్నారని, ఒకవేళ కొనేందుకు ఎవరైనా వచ్చినా తక్కువ రేటుకు అడుగుతున్నారని చెప్పారు. ఆర్ఎస్ఆర్లో ఇనాం అని ఉండటం వల్ల 1బీ అడంగల్లో ఇనాం పొందుపరిచినట్లు సర్వేయర్ అంటున్నారని తెలిపారు.
● మైదుకూరులో నాఫెడ్ సంస్థకు, ఉల్లి పరిశోధన కేంద్రం ఎన్హెచ్ఆర్డీఎఫ్లకు భూమిని కేటాయించాలని బీపీ వెంకట ప్రతాప్రెడ్డి కోరారు. జనవరి 18న ముఖ్యమంత్రి చంద్రబాబు మైదుకూరు పర్యటనకు వచ్చినపుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్నారు. జలవనరుల శాఖ భూమి ఉల్లి పరిశోధన కేంద్రానికి, నాఫెడ్ సంస్థ భూమి వాణిజ్య అవసరాల కోసం తిరిగి ఆ సంస్థకే కేటాయించాలని కోరారు.
● తమ గ్రామ సర్వే నంబరు 158లో 3.26 ఎకరాల భూమి తాను 1986లో కొనుగోలు చేశానని జమ్మలమడుగు మండలం పి.సిరిగేపల్లె గ్రామానికి చెందని ఎస్.గుర్రప్ప తెలిపారు. అయితే చిన్నదండ్లూరు గ్రామానికి చెందిన మాచనూరు వీరారెడ్డి అనే రైతు ఆ భూమి తనకు వచ్చిందంటూ సరిహద్దు రాళ్లు పీకేసి సుమారు ఎకరా భూమిని ఆక్రమించారని ఆరోపించారు.
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ సి.శ్రీధర్తోపాటు జిల్లా అధికారులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఎస్డీసీ వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, మెప్మా పీడీ కిరణ్కుమార్తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.