భువనగిరి: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ–2026 పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో 74.05శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 5 నుంచి 12 వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. మొత్తం 158 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 117 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 53మంది, బాలురు 64 మంది ఉన్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు.
మత్తు పదార్థాలకు
దూరంగా ఉండటమే మేలు
భువనగిరి: ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మేలని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. గురువారం భువనగిరి పట్టణ శివారులోని టీచర్స్కాలనీలో న్యూ హోప్ అసోసియేషన్ జిల్లా డీ అడిక్షన్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెడు అలవాట్లను విడిచి పెట్టి పునరావాస అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై పునరావాసం పొందుతున్న వారు క్రీడలు,వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు, విద్య, ఉపాధి అవకాశాల పై దృష్టిపెట్టాలన్నారు. క్రమ శిక్షణ, సానుకూల ఆలోచనలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. అంతకు ముందు పునరావాస కేంద్రంలో చికిత్సపొందుతున్న వ్యక్తులతో ఎస్పీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ, రూరల్ సీఐలు రమేష్, చంద్రబాబు, రూరల్ ఎస్హెచ్ఓ అనిల్కుమార్, పోలిస్ సిబ్బంది ఉన్నారు.
పారదర్శక ఓటరు జాబితా కోసమే ఎస్ఐఆర్
ఆలేరురూరల్: పారదర్శక ఓటరు జాబితా కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 171లో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ విధానాన్ని పరిశీలించి మాట్లాడారు. సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్డెస్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని విధిగా తీసుకొని వివరాలు నమోదు చేసి తిరిగి అందజేయాలన్నారు. 2002 ఓటరు జాబితాలో పేర్లు కలిగిన ప్రతి ఓటరు తమ వివరాలను ధ్రువీకరించుకొని బీఎల్ఓలకు అందజేయాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, అధికారులు తదితరులు ఉన్నారు.


