భువనగిరిటౌన్ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. అడ్డగూడూరు మండలం డి. రేపాక గ్రామంలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల్లో ప్రస్తుతం పది మందికి సంబంధించి 16 ఎకరాల 30 గుంటల భూమికి నష్టపరిహారంగా రూ. 2,10,46,786 విలువైన చెక్కులను బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీఓ కృష్ణారెడ్డిలతో కలిసి రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సామేల్ మాట్లాడుతూ డి. రేపాకలోని సర్వే నంబర్ 165 పరిధిలో గల భూములను ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దఫా కింద మొత్తం 15 మంది రైతుల నుంచి 28 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే, ప్రస్తుతానికి పది మంది రైతులకు చెక్కులు అందజేశామన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో మోత్కూరు, అడ్డగూడూరు ప్రాంతాలు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.త్వరలోనే మోత్కూరులో కోర్టు ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కృష్ణా రెడ్డి, తహసీల్దార్ ఎ. శేషగిరి రావు, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు, ఆర్ఐ నగేష్ కుమార్, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, మార్కెట్ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, జీపీఓ మాధవి పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే మందుల సామేల్


