నిడమనూరు : ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన నల్లబోతు సోమయ్య(65) ద్విచక్ర వాహనంపై ముకుందాపురం పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ వద్ద రోడ్డు దాటుతుండగా మిర్యాలగూడ నుంచి వస్తున్న టిప్పర్ అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని వైద్యం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడమనూరు ఎస్ఐ డి. విజయ్కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని దుర్మరణం
కోదాడ రూరల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్ వద్ద బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాపురం జంక్షన్ వద్ద రోడ్డు వెంట నిలబడి ఉన్న వ్యక్తిని విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడు నీలం రంగు చొక్కా, ఖాకీ రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు వివరించారు. మృతుడి వివరాలు లేదా అతడికి సంబంధించిన సమాచారం తెలిస్తే కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.


