కోదాడ : విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడానికి నిరంతర కృషి చేయాలని, అబ్దుల్ కలాంను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ట్రస్ట్ చైర్మన్ కత్రం శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఫీజులు కట్టేందుకు ఇబ్బందులు పడొద్దనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గ పరిధిలోని 39 మంది విద్యార్థులకు రూ.4.20 లక్షల ఉపకార వేతనాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ముత్తవరపు రామారావు, పబ్లిక్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కత్రం సీతరాంరెడ్డి, పోటు రంగారావు, బడుగుల సైదులు, జితేందర్రెడ్డి, నాగార్జున, కత్రం కిరణ్, ముడియాల సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్
వి.వి. లక్ష్మీనారాయణ


