మీసేవ.. డిజిటల్‌ తోవ | - | Sakshi
Sakshi News home page

మీసేవ.. డిజిటల్‌ తోవ

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కాగిత రహిత పాలనే ధ్యేయం

కొత్త నిబంధనల ప్రకారం.. జిల్లాలోని మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తుదారుల నుంచి కచ్చితమైన, యాక్టివ్‌గా ఉన్న మొబైల్‌ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. జూన్‌ 19 నుంచి ఎలాంటి ఫిజికల్‌ (కాగితపు)రసీదులను ప్రింట్‌ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘించి పాత పద్ధతిలోనే కాగితపు రశీదులు జారీ చేస్తే జిల్లాలోని సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని ఐటీ, ఈఎస్‌డీ కమిషనర్‌ ఉత్తర్వులుల్లో హెచ్చరించారు. అప్లికేషన్‌ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్‌ మొబైల్‌ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

భువనగిరిటౌన్‌: మీసేవ కేంద్రాల్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చే కాగితపు రసీదులకు కాలం చెల్లింది. పేపర్‌ లెస్‌ పాలనలో భాగంగా జిల్లాలోని 70 మీసేవ కేంద్రాల్లో శుక్రవారం నుంచి డిజిటల్‌ రసీదుల విధానం అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (మీసేవ) కమిషనర్‌ ఆదేశాల మేరకు.. ఇకపై కాగితపు ప్రింట్లకు బదులుగా దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా అక్నాలెడ్జ్‌మెంట్‌ హైపర్‌లింక్‌ పంపనున్నారు. పాత పద్ధతిలో ప్రింట్‌ ఇస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మొబైల్‌కే రశీదు లింక్‌..

కొత్త విధానం ప్రకారం.. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే, దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అందులో అప్లికేషన్‌ నంబర్‌, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్‌లింక్‌ ఉంటుంది. పౌరులు ఆ లింక్‌పై క్లిక్‌ చేసి తమ అక్నాలెడ్జ్‌మెంట్‌ రశీదును ఎప్పుడైనా వీక్షించవచ్చు, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు లేదా ప్రింట్‌ తీసుకోవచ్చు. సర్టిఫికెట్‌ చేతికి వచ్చే వరకు ఈ ఎస్‌ఎంఎస్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు.

అందుబాటులో రీ సెండ్‌ ఆప్షన్‌..

మొబైల్‌కు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ పొరపాటున డిలిట్‌ అయినా లేదా పోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీసేవ అప్లికేషన్‌లో సదరు ఎస్‌ఎంఎస్‌ను తిరిగి పంపించే సౌకర్యాన్ని కల్పించారు. దరఖాస్తుదారులు కోరితే ఆపరేటర్లు మళ్లీ మెసేజ్‌ పంపేలా సహాయం అందిస్తారు.

కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధానం అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీ సేవ కేంద్రాల్లో పేపర్‌ రసీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం.

– సాయికుమార్‌, మీ సేవ జిల్లా మేనేజర్‌

ఫ మీసేవ కేంద్రాల్లో నేటి నుంచి డిజిటల్‌ రసీదుల విధానం

ఫ కాగితపు రశీదులకు ఇక చెల్లు

ఫ దరఖాస్తుదారుడి మొబైల్‌కే అక్నాలెడ్జ్‌మెంట్‌ హైపర్‌లింక్‌

ఫ పొరపాటున డిలిట్‌ అయితే తిరిగి పంపించే వెసులుబాటు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement