సాక్షి, యాదాద్రి : ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ టీకా దినోత్సవం (పల్స్ పోలియో) కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల సుమారు 57,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 647 పోలియో బూత్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 29, 30 తేదీల్లో కూడా ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. జిల్లాను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రాబోయే 15 రోజుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, మెడికల్ షాపులు, క్లినిక్లు, వైద్య సిబ్బంది వివరాలను వంద శాతం ఆన్లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం స్టాప్ డయేరియా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.
శ్రీమత్స్యగిరి ఆలయ ఈఓగా వెంకటయ్య
వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన కార్యనిర్వహణ అధికారి(ఈఓ)గా కొత్తపెల్లి వెంకటయ్య మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిత్య కై ంకర్యాలు నిర్వహిస్తూ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతతకుముందు ఆయనకు ఆలయ సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆయిల్ పామ్ సాగుతో ఆదాయం
మోత్కూరు : ఆయిల్ పామ్ తోటల సాగు చేసిన నాలుగేళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు పంట దిగుబడితో ఆదాయం పొందవచ్చని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి అన్నారు. మోత్కూరు మండలం రాగిబావి గ్రామంలో రైతు ఎన్నం మధుసూదన్రెడ్డి ఆయిల్ పామ్ తోటలో మంగళవారం గెలల తొలి కోతను జిల్లా మేనేజర్ ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఎన్నం మధుసూదన్రెడ్డి 2023 ఏప్రిల్లో నాటిన 9 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో ప్రస్తుతం తొలి కోతను ప్రారంభించామని తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఫీల్డ్ ఆఫీసర్ మమత మాట్లాడుతూ ఆయిల్ పామ్ నాలుగేళ్ల కృషికి నేడు ఫలితం లభించిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర రూ.23,852 ఉందన్నారు. సాగుకు సంబంధించిన పూర్తి వివరాలకు సెల్ :7093585983 సంప్రదించాలని కోరారు.
ఎరువుల ధరలు తగ్గించాలి
భువనగిరిటౌన్ : ఎరువుల ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పేరబోయిన బంగారి అధ్యక్షతన రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను విపరీతంగా పెంచి రైతాంగంపై అదనపు భారం మోపిందన్నారు. పంటలకు నామమాత్రంగా గిట్టుబాటు ధరలు కల్పిస్తోందని విమర్శించారు. మదర్ డెయిరీ పాల రైతులకు పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. జిల్లాలో నిలిచిపోయిన రైతుబంధు, రుణమాఫీని అందరికీ వర్తింపజేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక రైతు సమస్యలపై ఎక్కడికక్కడ ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు రాజయ్య, సీపీఐ, రైతు సంఘం నాయకులు చేడె చంద్రయ్య, ఏశాల అశోక్, చెక్క వెంకటేష్, పేరబోయిన మహేందర్, దయాకర్ రెడ్డి, అంజయ్య, కొమరయ్య, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


