ఫ యువకుడు మృతి
చందంపేట : ఇంట్లో దండెంపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం పెద్దమూలలో మంగళవారం రాత్రి జరిగింది. పెద్దమూల గ్రామానికి చెందిన చేపూరి అరుణ్(30) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పని ముగించుకుని ఇంటికి వచ్చిన అరుణ్ రాత్రి బట్టలు ఉతికి దండెంపై ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం అతడిని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు.


