రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు పడుతున్నాం
ప్రభుత్వానికి నివేదించాం
మోత్కూరు : మోత్కూరులో స్టాంప్ పేపర్ల (బాండ్ పేపర్ల) కొరత నెలకొంది. రెండు నెలలుగా రూ.50, రూ.100 బాండ్ పేపర్లు దొరకడంలేదు. దీంతో భూ, ఇళ్ల క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోత్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాలు ఉంటాయి. స్టాంప్ పేపర్లు అమ్మేందుకు మోత్కూరులో నలుగురు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో ఒక్కరు చొప్పున స్టాంప్ వెండర్లు ఉన్నారు. మోత్కూరులో నెలకు ఒక్కో వెండర్ కనీసం 300పైగా బాండ్లు విక్రయిస్తారు. పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ వందల్లో వీటి విక్రయాలుంటాయి. ప్రస్తుతం కార్యాలయంలో కేవలం రూ.20 విలువైన బాండ్ పేపర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.50, రూ.100 బాండ్ పేపర్ల కోసం 50కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరి, రామన్నపేట, జనగామ, నల్లగొండ పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందని రియల్టర్లు, స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి డిమాండ్కు తగ్గ స్టాంప్ పేపర్లు సరఫరా చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
మోత్కూరులో రూ.50, రూ.100 స్టాంప్ పేపర్ల కొరత
ఫ కావాలంటే 50 కిలోమీటర్లు వెళ్లాల్సిందే
ఫ ఆస్తుల క్రయవిక్రయదారుల అవస్థలు
రిజిస్ట్రేషన్ల సమయంలో స్టాంప్ పేపర్లు లభించక ఇబ్బందులు పడుతున్నాం. రూ.50, రూ.100 స్టాంప్ పేపర్ల కోసం భువనగిరికి వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకుంటున్నాం. అవసరమైన స్టాంప్ పేపర్లు సరఫరా చేయాలి.
– చొల్లేటి నరేష్, రియల్టర్, మోత్కూరు
స్టాంప్ పేపర్లకు కొరత వాస్తవమే. రూ.50, రూ.100 విలువైన స్టాంప్ పేపర్ల సరఫరా లేదు. మా కార్యాలయంలో రూ.20 విలువైన స్టాంప్ పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదించాం. త్వరలోనే సరఫరా చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
– వి.వరప్రసాద్, సబ్ రిజిస్ట్రార్, మోత్కూరు


