భువనగిరి : పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో భిక్షపతి అన్నారు. సోమవారం మండలంలోని అనంతారం, బీబీనగర్ మండలం గూడూరు గ్రామాల్లోని పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రంగరాజన్, ఉపాధ్యాయులు ఉన్నారు.
బోనంతో ‘బడిబాట’ ప్రచారం
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం సోమవారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. మాజీ సర్పంచ్ భీమగాని రాములు, మాధవి గౌడ్ ఆధ్వర్యంలో ‘బోనంతో బడి బా ట’ నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరుతూ మాజీ సర్పంచ్ రాములు స్వయంగా నెత్తిన బోనం ఎత్తుకుని ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే, భీమగాని తేజస్విని ఫౌండేషన్ తరఫున ఒక్కో విద్యార్థికి రూ. 5వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి శశాంక్ను సత్కరించారు. అనంతరం ఆ విద్యార్థికి రూ. 5వేల నగదు అందజేశారు.
రాయిపల్లిలో అమ్మమాట.. అంగన్వాడీ బాట
ఆత్మకూరు(ఎం) : మండలంలోని రాయిపల్లిలో ఐసీడీఎస్ మోత్కూరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ వాణిశ్రీ , సర్పంచ్ ఇంద్రాల అంజయ్య, అంగన్వాడీ టీచర్ ప్రేమలత, సంఘ బంధం అధ్యక్షుడు పంజాల జ్యోతి, ఇందిరమ్మ పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల
సంతకాల సేకరణ
మోత్కూరు : తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికుల పోస్టులను పర్మినెంట్ చేయాలని, రెండవ పీఆర్సీలో నెలకు కనీసం రూ.26 వేలుగా నిర్ణయించాలన్నారు. వేతనాలలో ఎలాంటి తగ్గింపు లేకుండా సిబ్బందికి కేటగిరిల వారీగా అమలు చేయాలని, ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు మెంట ఎల్లయ్య, యూనియన్ మండల అధ్యక్షులు డి.లింగమ్మ, ఎన్.అండాలు, కె.లక్ష్మి, అరవింద్, అవినాష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


