భువనగిరిటౌన్ : సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం వెలుపల ప్రజలకు స్పష్టంగా కనిపించేలా సమాచార అధికారుల వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలి. పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అధికారి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో సహా బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలి. కానీ జిల్లా కేంద్రంలోని పలు శాఖల కార్యాలయాల్లో ఈ బోర్డులు కనిపించడం లేదు. కొన్ని కార్యాలయాల ఎదుట బోర్డులు ఉన్నా అవి లోపల మూలల్లో, దుమ్ముపట్టి దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని శాఖల్లో బోర్డులపై పాత అధికారుల పేర్లే ఉన్నాయి. సమాచారం అడిగితే సెక్షన్లలోని సిబ్బంది ఒకరిపైకి ఒకరు నెట్టేస్తూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయం తమ శాఖకు సంబంధించిన పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అధికారి వివరాలను, వారి ఫోన్ నంబర్లతో సహా బోర్డులపై ప్రదర్శించాలి. ఆయా అధికారులు బదిలీ అయినప్పుడు కొత్త వారి వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలి. ఇది తెలుసుకోవడం ప్రజల ప్రాథమిక హక్కు. అయినప్పటికీ ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట
కనిపించని ఆర్టీఐ వివరాలు
ఫ అప్పిలేట్ అధికారి ఎవరో తెలియని పరిస్థితి
ఫ సమాచారం తెలుసుకునేందుకు
సామాన్యుల అగచాట్లు


