ప్రభుత్వాలు చెప్పినట్లు పనిచేస్తున్న ఎన్నికల సంఘం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలు చెప్పినట్లు పనిచేస్తున్న ఎన్నికల సంఘం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

భువనగిరి: ప్రస్తుతం కాలంలో ప్రభుత్వాలు చెప్పినట్లుగానే ఎన్నికల సంఘం పనిచేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో నియోజకవర్గ బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు సర్‌ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఇటీవల సుమారు 91 లక్షల ఓట్లను తొలగించడాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మీనాక్షి నజరాజన్‌ వంటి వారి నామినేషన్‌ తొలగించారని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న సర్‌(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) విషయంలో పార్టీ బూత్‌ లెవల్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్‌ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అర్హులైన వారి ఓట్లను తొలగించకుండా చూడటంలో పార్టీ ఏజెంట్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. అనంతరం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు ఇస్తోందన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. మళ్లీ కేసీర్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ శాఖలో అవీనీతిపెరిగిపోయి శాంతిభద్రతలు లేకుండా పోతుందన్నారు. హత్యలు, తత్యాచారాలతో పాటు గత 10 ఏళ్లలో లేని దోంగతనాలు ఎక్కువగా కావడం పోలీసుల పనితనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం కావడంతోపాటు స్కామ్‌లు పెరిగిపోయినట్లు చెప్పారు. డబ్బులు సంపాదన లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు అదే పనిగా ఉంటున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ సర్‌ జిల్లా ఇన్‌చార్జి క్యామ మల్లేష్‌, పార్టీ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్‌ కొల్పుల అమరేందర్‌, మాజీ జెడ్పీటీసీ మల్లయ్య, మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement