వసూళ్లకు అడ్డాలుగా..
ఫ రికార్డులు స్వాధీనం
సాక్షి, యాదాద్రి : బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు రాత్రి వరకు జరిగాయి. స్టాంప్ డ్యూటీల్లో అవకతవకలపై, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న దస్త్రాలు, రిజిస్టర్లను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఫీజుల చెల్లింపుల వివరాలు సేకరించారు. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులు ఉన్న ఉద్యోగులను విచారించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలకు వచ్చిన విషయం తెలిసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిసరాల్లోని డాక్యుమెంట్ రైటర్లు తమ షాపులను మూసి వేసి వెళ్లిపోయారు. కాగా, బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గతంలో ఏసీబీ అధికారులు దాడులు జరిగాయి. అప్పట్లో సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కూడా అయ్యారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి డాక్యుమెంట్కు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, రామన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి రోజు 30 నుంచి 40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే.. వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పత్రాలు సరిగా లేకుంటే రూ.5వేల నుంచి రూ.10వేల వరకు తీసుకుంటారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బు వసూలు జరుగుతోంది.


