రాష్ట్రంలో ఉచిత విద్యనందించాలి
మునగాల : కేరళలో అమలు చేసినట్లుగా తెలంగాణలోనూ ఉచిత విద్యను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. శనివారం మునగాల మండలంలోని జగన్నాధపురంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారకసభ నిర్వహించారు. ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మునగాల చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతమని, ఆనాటి మునగాల పరగణాలో కలకోవ, జగన్నాధపురం గ్రామాలకు చెందిన ఎందరో యోధులు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అమరులయ్యారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుందని, కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై సీపీఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేయాలని సూచించారు. పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన స్మారక సభలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లు లక్ష్మి, ములకపల్లి రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, షేక్ సైదా, జూలకంటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ


