కొత్తగా | - | Sakshi
Sakshi News home page

కొత్తగా

Jun 19 2025 7:50 AM | Updated on Jun 19 2025 7:50 AM

కొత్తగా

కొత్తగా

సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి, యాదాద్రి:

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచాలన్న నిబంధన ఉంది. అయితే, 2021లో జరగాల్సిన జనగణన ఆలస్యం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెండు రోజుల కిందట గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం 2008 చివరలో నియోజక వర్గాలను పునర్‌ వ్యవస్థీకరించారు. అంతకుముందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండేవి. 2008 పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. అదనంగా ఏమీ పెరుగలేదు. అప్పట్లో రామన్నపేట నియోజకవర్గం రద్దయి, కొత్తగా హుజూర్‌నగర్‌ ఏర్పడగా, చలకుర్తి నియోజకవర్గం స్థానంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జనాభా 50 లక్షల వరకు పెరిగినట్లు అంచనా. దాని ప్రకారం మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు, రాజకీయ నేతలు చెబుతున్నారు.

జిల్లా పరిధి మారకుండా పునర్విభజన

నియోజకవర్గాల పునర్విభజనను భౌగోళిక అంశాలు, పరిపాలన సౌలభ్యం పరిగణనలోకి తీసుకొని ఆ జిల్లాల్లోనే నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, గ్రామాలు ఉండేలా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని మండలాలు ఒక జిల్లా పరిధిలో ఉండగా, మరికొన్ని మండలాలు మరో జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో ఉన్నాయి. రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, శాలిగౌరారం మండలాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు అదే జిల్లాలో ఉండేలా పునర్విభజన చేసే అవకాశం ఉంది. మరోవైపు 2027లో పూర్తయ్యే జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం జనాభా ప్రతిపాదికనా.. లేక ఓటర్ల ప్రాతిపదికన నియోజక వర్గాలను ఏర్పాటు చేస్తుందా అనేది కూడా తేలాల్సి ఉంది.

తెరపైకి

పాత నియోజకవర్గాలు..

గతంలో రద్దయిన పాత నియోజకవర్గాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. 2027లో జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగనుంది. అయితే మూడు నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడనున్నందున అందులో తిరిగి రద్దయిన పాత నియోజకవర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారన్న చర్చ జరగుతోంది.

నల్లగొండ అర్బన్‌, రూరల్‌

నియోజకవర్గాలుగా..

నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా ఏర్పడతాయన్న చర్చ గత కొంత కాలంగా సాగుతోంది. నల్లగొండ పట్టణంలో రెండు లక్షలపైగా జనాభా, 1.20 లక్షల వరకు ఓటర్లున్నారు. నల్లగొండ పట్టణంతో పాటు రూరల్‌ మండలం కలుపుకుని నల్లగొండ అర్బన్‌ ని యోజక వర్గంగా ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కనగల్‌, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలను కలుపుకొని నల్లగొండ రూరల్‌ నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చనే చర్చ సాగుతోంది.

నాగారం కూడా..

ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారంను కూడా నియోజకవర్గం చేస్తారనే చర్చ జరుగుతోంది. నాగారం గతంలో నియోజవర్గంగా ఉంది. అక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి 1962లో ఎ.రంగారెడ్డి గెలుపొందారు. అయితే 1966లో ఆ నియోజకవర్గం రద్దయి, తుంగతుర్తి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ దానిని ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. నాగారంను తిరిగి నియోజకవర్గంగా చేయాల్సి వస్తే నాగారం, అడ్డగూడురు, తిరుమలగిరి, అర్వపల్లి మండలాలతో చేసే అవకాశం ఉంది.

సూర్యాపేట అర్బన్‌..

ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట టౌన్‌తో పాటు రూరల్‌ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్‌ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. సూర్యాపేట రూరల్‌ నియోజకవర్గాన్ని ఆత్మకూర్‌ (ఎస్‌), చివ్వెంల, పెన్‌పహాడ్‌, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే నాగారం నియోజకవర్గం ఏర్పాటైతే సూర్యాపేట రూరల్‌ నియోజకవర్గం ఉండకపోవచ్చని, సూర్యాపేట రూరల్‌ ఉంటే నాగారం నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉండదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

అసెంబ్లీ సెగ్మెంట్లు

మోత్కూరు, చౌటుప్పల్‌

నియోజకవర్గాలకు డిమాండ్‌

చౌటుప్పల్‌, మోత్కూరు కేంద్రాలుగా నియోజకవర్గాల డిమాండ్‌ వస్తోంది. మోత్కూరు నియోజకవర్గం అడ్డగూడూరు, మోత్కూరు, గుండాల, ఆత్మకూర్‌(ఎం), వలిగొండ, మోటకొండూరు మండలాలతో ఏర్పాటు చేయాలని మోత్కూరు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. తమ ప్రాంతాన్ని తుంగతుర్తి నియోజకవర్గంలో కలపడం వల్ల రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. మరో వైపు డివిజన్‌ కేంద్రమైన చౌటుప్పల్‌ను నియోజకవర్గ కేంద్రం చేయాలన్న చర్చ కూడా జరగుతోంది.

33 శాతం మహిళా రిజర్వేషన్‌

కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాల పునర్విభజనతోపాటు 33 శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కేంద్రం చర్యలు చేపడుతోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో దీనిని కచ్చితంగా అమలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోనూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు మహిళలకే దక్కనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement