
సినీ ఫక్కీలో బంగారం చోరీ
ఫ వృద్ధురాలిని మంచానికి కట్టేసి 9 తులాల బంగారంతో ఉడాయించిన కేటుగాళ్లు
నాగారం: సినీ ఫక్కీలో వృద్ధురాలిని మంచానికి కట్టేసి 9 తులాల బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నాగారం మండలం ఈటూరు గ్రామంలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈటూరు గ్రామానికి చెందిన నంగునూరి బయ్యమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. వీరందరికి వివాహాలు అయ్యాఇ. బయ్యమ్మ కుమారుడు శ్రీరాములు ఉద్యోగ రీత్యా చైన్నెలో ఉంటున్నాడు. బయ్యమ్మ భర్త కొనేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె ఇంటి వద్ద ఒంటరిగానే ఉంటుంది. మంగళవారం రాత్రి బయ్యమ్మ ఇంట్లో నిద్రించగా.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కరెంట్ పోయింది. దీంతో ఆమె ఇంటి బయటికి వచ్చి వరండాలో మంచం వేసుకొని నిద్రించింది. ఆమె నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికే నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనుక నుంచి వచ్చి బయ్యమ్మ రెండు చేతులను చీరతో మంచానికి కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలో ఉన్న 2తులాల బంగారు నల్లపూసల గొలుసు గుంజుకున్నారు. అనంతరం ఇంట్లోకి చొరబడి ఇంట్లోని ట్రంక్ పెట్టెలో దాచిన 4 తులాల బంగారు పెద్ద గొలుసు, 3 తులాల పుస్తెలతాడుతో పాటు ఆమె నడుముకున్న చెక్కుడు సంచిలో ఉన్న రూ.2500 లాక్కోని పారిపోయారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ ఎం. ఐలయ్య తెలిపారు.
యాదగిరిగుట్ట ఆలయంలో రికార్డుల పరిశీలన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించిన పలు రికార్డులను విజిలెన్స్ అధికారులు బుధవారం పరిశీలించారు. ప్రతి ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి విజిలెన్స్ అధికారులు ఆలయంలో రికార్డులను పరిశీలించినట్లుగానే బుధవారం విజిలెన్స్ అధికారులకు ఆలయానికి వచ్చి రికార్డులు పరిశీలించినట్లు ఆలయ అధికారులు చెప్పారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటు మరో ఐదుగురు సభ్యులతో కలిసి ఆలయ అకౌంట్ సెక్షన్లో రికార్డులను చూ శారు. ఆలయానికి ఆదాయం ఎంత వస్తుంది, గతేడాది ఎంత వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా, నగలు ఎంత ఉన్నాయి, ఖర్చులు ఎంత అవుతున్నాయే అంశాలపై రికార్డులను పరిశీలించి వెళ్లారు. వారి వెంట ఆలయ డిప్యూటీ డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, పలువురు ఉద్యోగులున్నారు.
కోర్టు ఆదేశాలు ధిక్కరణ..
ఐదుగురికి రిమాండ్
నూతనకల్: నూతనకల్ మండలం యడవెల్లి గ్రామానికి చెందిన బొడ్డు సైదులు, వనం రాజు, పిట్టల కృష్ణ, బొడ్డు రాజాలు, నెల్లుట్ల సైదులు గతంలో గ్రామంలో ఘర్షణకు పడగా.. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. అయితే వారు కేసు వాయిదాలకు హాజరుకాకుండా కోర్టు ధిక్కారణ చర్యలకు పాల్పడడంతో బుధవారం నాన్ బెయిలెబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
వైభవంగా నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ఎదుర్కోలు మహోత్సవ సంవాదం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్గిగావించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, భక్తులు పాల్గొన్నారు.