
రైతు భరోసా.. ఇదేమి గోస!
మూడు ఎకరాల్లోపే ఉన్నా అందని పెట్టుబడి సాయం
మూడు రోజుల్లో రూ.122 కోట్లు ..
భువనగిరిటౌన్ : రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,84,250 మంది రైతులు ఉండగా రూ.317.57 కోట్లు పంట పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరిలో మూడు ఎకరాల్లోపు ఉన్న 1,68,349 మంది రైతులకు బుధవారం వరకు రూ. 122 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ తెలిపారు.
యాదగిరిగుట్ట రూరల్: మూడు ఎకరాల్లోపే ఉన్నా రైతు భరోసా డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు మూడెకరాల్లోపు రైతులందరి ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ కొందరి ఖాతాల్లో సగం నగదే జమ కాగా, మరికొందరికి అసలే అందలేదు. దీంతో వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులకు వచ్చి అధికారులను సంప్రదిస్తున్నారు.
టీజీబీలో ఎక్కువ మంది బాధితులు
ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీబీ)లో ఖాతాలున్న రైతుల్లో చాలా మందికి రైతుభరోసా డబ్బులు జమకాలేదు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు పేరును గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చారు. నూతన ఐఎఫ్ఎస్ కోడ్ అమలు చేసింది. ఈ కారణంగా టీజీబీలో ఖాతా ఉన్న రైతులకు రైతుభరోసా డబ్బులు జమకాలేదని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదంటున్నారని రైతులు చెబుతున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు పూర్తిస్థాయిలో రైతుభరోసా డబ్బులు జమకాలేదు. యాదగిరిగుట్టకు చెందిన పంజాల సురేష్ అనే రైతుకు ఎకరం 30 గుంటల భూమి ఉండగా 52 గుంటలకు మాత్రమే రైతుభరోసా వచ్చింది. గత ప్రభుత్వం మొత్తం భూమికి వచ్చిందని, రెండు దఫాలుగా పూర్తిస్థాయిలో రావడం లేదని, అధికారులు తమకు తెలియదని సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు.
ఫ కొందరికి సగం, మరికొందరికి అసలే జమకాని నగదు
ఫ వ్యవసాయ, బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్న రైతులు