
సీఈసీ గ్రూప్ అప్పాజిపేటకు తరలింపు
మోటకొండూర్: మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సీఈసీ గ్రూప్ను నల్లగొండ మండలంలోని అప్పాజిపేటలో గల బాలికల గురుకుల పాఠశాలకు తరలిస్తున్నారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటకొండూర్ గురుకుల పాఠశాలలో గతేడాది బైపీసీ, సీఈసీ, ఎంపీసీ గ్రూప్లలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యను బోధించారు. కాగా ఈ సంవత్సరం అడ్మిషన్ల సమయంలో కూడా ఆన్లైన్లో ఇంటర్ సీఈసీ మోటకొండూర్ చూపించడంతో విద్యార్థులు ఆప్షన్ ఇచ్చుకున్నారు. తీరా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు మాత్రం నల్లగొండ మండలంలోని అప్పాజిపేట గురుకుల పాఠశాలలో సీఈసీ బోధన ఉంటుందని ప్రిన్సిపాల్ జ్యోతి చెబుతున్నారు. ఇంటర్ సీఈసీ సబ్జెక్ట్లు బోధించడానికి సరైన ఫ్యాకల్టీ, తరగతి గదులు లేవని దీంతో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం సీఈసీని అప్పాజిపేటలోని గురుకులంలో నిర్వహిస్తారని ఆమె తెలిపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆన్లైన్లో చూపించకుండా అక్కడే చూపిస్తే మేము ఆప్షన్ పెట్టుకోకుండా ఉండేవారమని, అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం కూడా ఇక్కడే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఫ మోటకొండూర్ బాలికల గురుకుల పాఠశాల నుంచి తరలించడంతో విద్యార్థినులకు ఇబ్బందులు