
ఎన్నేళ్లకెన్నాళ్లకు..!
బొల్లేపల్లి కాల్వ నిర్వాసితుల గుర్తింపునకు కదిలిన యంత్రాంగం
● 2022లో 80 ఎకరాలకు పైగా భూ సేకరణ
● రెండు దశాబ్దాలు
గడిచినా అందని పరిహారం
● రైతుల వినతులు, పోరాటాలతో కదలిక
● ప్రారంభమైన సర్వే
బీబీనగర్ : సాగునీటి కాల్వ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 20 ఏళ్లలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, అధికారులకు వినతులు, ప్రజాప్రతినిధుల నిలదీతలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల్లో కదలిక వచ్చింది. కాల్వ కోసం రైతులు ఇచ్చిన భూములను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు.
కాల్వ స్వరూపం ఇదీ..
బీబీనగర్, భువనగిరి మండలాల పరిధిలోని ఎనిమిది గ్రామాలతో పాటు ఐదు గిరిజన తండాలకు బీబీనగర్ మండలం రాఘవాపురం చెరువు నుంచి సాగునీరు అందజేయాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం రాఘవాపురం చెరువు వద్ద నుంచి భువనగిరి మండలం బొల్లేపల్లి వరకు 21 కిలో మీటర్ల మేర కాలువ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. అదే సంవత్సరం కాల్వ పనులను ప్రారంభించి 2002లో పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా రాఘవాపురం, లక్ష్మీదేవిగూడెం, బ్రాహ్మణపల్లి, రామునిగుండ్లతండా, పెద పలుగుతండా, జంపల్లి, బొల్లేపల్లితో పాటు మరో ఆరు గ్రామాల పరిధిలో సుమారు 2వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
80 ఎకరాల మేర భూ సేకరణ
కాల్వ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించగా నేటికీ వారికి పరిహారం మాత్రం అందలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. గతంలో సేకరించిన భూ మికి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలువ 16.5 మీటర్ల వెడల్పు ఉంది. కుడివైపు 10 మీటర్లు, ఎడమ వైపు 6.5 మీటర్లు వెడల్పు ఉండేలా హద్దురాళ్లు పెడుతున్నారు. మొత్తం 80 ఎకరాల మేర భూ సేకరణ జరగనుంది.
రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో సర్వే
రైతుల పోరాటాలు, ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చొరవతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో పది రోజుల క్రితం సర్వే ప్రారంభించారు. గ్రామాల వారీగా ఎంత భూమి పోయింది, రైతులు ఏమేరకు నష్టపోయారో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
త్వరగా పరిహారం అందజేయాలి
బొల్లేపల్లి కాల్వ ద్వారా భూములు కొల్పోయిన రైతులకు రెండు దశాబ్దాలు గడిచినా నష్టపరి హా రం అందలేదు, దీని పై గతంలో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. సర్వే నివేదిక ప్రకారం రైతులందరికీ త్వరగా పరిహారం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– కొమ్మిడి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే,
బ్రాహ్మణపల్లి, బీబీనగర్ మండలం
కాల్వలో రెండు ఎకరాలు పోయింది
బొలేపల్లి కాల్వలో రెండు ఎకరాల భూమి పోయింది. 25 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పరిహారం రాలేదు. మొన్నటి నుంచి అధికారులు సర్వే చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి.
– ముక్కెర వెంకటేష్ యాదవ్, బట్టుగూడం
9 కిలో మీటర్లు సర్వే జరగాల్సి ఉంది
బొల్లేపల్లి కాల్వ మొత్తం 21కిలో మీటర్ల పొడవు ఉంది. ఇప్పటి వరకు భూ సేకరణకు సంబంధించి 12 కిలో మీటర్ల మేర సర్వే పూర్తి చేశాం. మరో తొమ్మిది కిలో మీటర్లు సర్వే చేయాల్సి ఉంది. సర్వే కొనసాగుతోంది. పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం.
– శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఏఈ,
బీబీనగర్ మండలం

ఎన్నేళ్లకెన్నాళ్లకు..!

ఎన్నేళ్లకెన్నాళ్లకు..!