కామవరపుకోట: మద్యానికి బానిసైన కొడుకు కన్న తండ్రి పాలిట కాలయముడయ్యాడు. ఇంటి పత్రాల కోసం తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన కామవరపుకోట మండలంలోని పాత గండిగూడెంలో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాత గండిగూడెం గ్రామానికి చెందిన పిండి వెంకటేశ్వరరావు (60) గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తుంటాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు పిండి శ్రీనివాసరావు ఉన్నారు. కుమార్తె వివాహం కాగా కుమారుడు శ్రీనివాసరావు మద్యానికి బానిసై డబ్బులు కావాలని కుటుంబ సభ్యులతో తరచూ గొడవపడేవాడు. దీంతో అతడి భార్య ఐదేళ్ల కిత్రం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి శ్రీనివాసరావు మద్యం తాగి ఇంటికి వచ్చి ఇంటి పత్రాలు ఇవ్వాలని తండ్రిపై వాగ్వివాదానికి దిగాడు. అందుకు తండ్రి వెంకటేశ్వరరావు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరావు తండ్రి వెంకటేశ్వరరావుపై దాడి చేసి హత్య చేశాడు. బుధవారం ఉదయం చింతలపూడి సీఐ పి.క్రాంతి కుమార్, ఎస్సై వల్లి పద్మ ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య పిండి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


