ఏలూరు (టూటౌన్) : సుకుమార్ కమిటీ సూచనలు, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులు అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు ముఖ్యమైనదని అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కాంతీలాల్ దండే అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేటులోని గౌతమీ సమావేశపు హాలులో కలెక్టర్ వెట్రిసెల్వి, ప్రిన్సిపల్ చీఫ్ అఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ డా. పీవీ చలపతిరావు, చీఫ్ కన్సర్వేటర్ అఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, జ్యోతిలతో కలిసి కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై కాంతీలాల్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డి.ఫారం భూములు సుమారు 20 వేల ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, జిరాయితీ, డి.ఫారం భూమిదారుల సమస్యలు పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తున్నామని, ఆ కమిటీ ఈనెల 29వ తేదీన ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తుందన్నారు. సమీక్ష సమావేశంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు అభిషేక్ గౌడ, రాహుల్కుమార్ రెడ్డి, డీఎఫ్ఓ త్రిమూర్తులు రెడ్డి, ఇన్చార్జి డీఆర్ఓ దేవకీదేవి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కొల్లేరు ప్రాంతాలకు చెందిన తహసీల్దార్లు, అటవీశాఖ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.


