కొత్తపేట: కుమార్తె పెళ్లి శుభలేఖలు పంచి వస్తున్న దంపతులను ఇసుక లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం తామరాడ గ్రామానికి చెందిన దాసిరెడ్డి నాగ వెంకట రామకృష్ణ, ధనలక్ష్మి కుమార్తెకు జూలై ఒకటిన వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ దంపతులు శుభలేఖలు పంచేందుకు మోటార్ సైకిల్పై ముమ్మిడివరంలో బంధువుల ఇళ్లకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొత్తపేట బోడిపాలెం సమీపానికి వచ్చేపరికి ఎదురుగా ఇసుక లోడుతో వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరిపి, ఉన్నత వైద్యం కోసం తణుకు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


