వీరవాసరంలో ఆక్వా రైతుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, చినమిల్లి వెంకటరాయుడు
వీరవాసరం: ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆందోళన వ్యక్తం చేశారు. వీరవాసరం తులసీ ఫంక్షన్ హాలులో మంగళవారం వైఎస్సార్సీపీ శెట్టిబలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రొయ్య రైతుల సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ.. ఫీడ్ ధరను కిలో రూ.4 చొప్పున తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారని, తీరా కంపెనీలు కేజీకి రూ.2 మాత్రమే తగ్గించి చేతులు దులిపేసుకున్నాయన్నారు. రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క రోజు ఫీడ్ ధరలు పెంచిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అప్సడా చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆకివీడు బహిరంగ సమావేశంలో రొయ్య రైతులకు యూనిట్ రూ.1.50కే సబ్సిడీపై విద్యుత్ అందజేస్తానని హామీ ఇచ్చారని, ఎన్నికలైనా తక్షణమే అమలు చేసి 55 వేల విద్యుత్ కనెక్షన్లకు రూ.1.50కే విద్యుత్ అందజేశారన్నారు.
వైఎస్సార్సీపీ హయాంలో ధీమా
వైఎస్సార్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చినమిల్లి వెంకటరాయుడు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పాలకొల్లు ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపీలు మాట్లాడుతూ రొయ్య రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే ఆదుకున్న ప్రభుత్వం ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఫీడు ఫ్యాక్టరీ యజమానులకు మాత్రమే కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని విమర్శించారు. రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించగానే కూటమి ప్రభుత్వం హడావుడిగా రేట్లు తగ్గించినట్లు ప్రకటించి రొయ్యల రైతులను నిలువునా వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఫీడ్ రేట్లు వెంటనే తగ్గించాలని, ఎలాంటి షరతులు లేకుండా రూ.1.50 కే విద్యుత్ సబ్సిడీని అందజేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో నిర్వహించి రొయ్యల రైతులకు మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు. సిండికేట్ వ్యవస్థకు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఎంతో సమయం పట్టదని హెచ్చరించారు. సమావేశంలో చవాకుల సత్యనారాయణ మూర్తి, దొంగ సత్యనారాయణ, వేగేశ్న వెంకటరాజు, గూడూరి ఓంకార్, బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి, వీరవల్లి శ్రీనివాసరావు, నాగరాజు వెంకట గోపాలకృష్ణంరాజు, మానుకొండ ప్రదీప్ కుమార్, నేతల జ్ఞాన సుందరరాజు, పేరిచర్ల విజయ నరసింహరాజు, నడపన గోవిందరాజులు, కాండ్రేకులు నరసింహరావు, మేడిద జాన్సన్, కాటం స్టాన్లీ రాజు, రొయ్య సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఫీడ్ ధర కేజీకి రూ.2 మాత్రమే తగ్గించడం దారుణం
రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ ఏమైంది?
ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతల నిలదీత


