భీమవరం : జిల్లాలో ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు 91.39 శాతం హాజరు నమోదైంది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెంలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 2,475 మంది విద్యార్థులకు 2,262 మంది హాజరయ్యారు. భీమవరంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో 1,186 మందికి 1,058 మంది హాజరయ్యారు. తణుకులోని రెండు కేంద్రాల్లో 662 మందికి 624 మంది హాజరయ్యారు.
నిబంధనలు కఠినంగా అమలు
పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేశారు. ప్రత్యేకమైన దుస్తులతో పాటు కాళ్లకు పట్టీలు, చెవులకు రింగులు, చేతికి తాళ్లు, మెడలో ఆభరణాలు వంటివి ఉండకూడదన్నారు. దీంతో తల్లిదండ్రుల సాయంతో వాటిని విద్యార్థినులు తొలగించారు. ప్రధానంగా జడ వేసుకోకూడదనే నిబంధనతో విద్యార్థినులు జడలు విప్పడం కనిపించింది.
పటిష్ట బందోబస్తు
భీమవరం, తణుకులోని కేంద్రాలను కలెక్టర్ సీ హెచ్ నాగరాణి తనిఖీ చేశారు. భీమవరంలోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ టి.రాహుల్కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రసన్నకుమార్రెడ్డి, తహసీల్దార్ ఆర్.రాంబాబు పరిశీలించారు. అలాగే పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి భీమవరంలోని రెండు కేంద్రాల గేట్ల వద్ద భీమవరం డీఎస్పీ రఘువీర్విష్ణు నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు.
జిల్లాలో 91.39 శాతం హాజరు


