దెందులూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న సర్ ప్రోగ్రాంలో ఆన్లైన్లో చేసిన ఓటర్ల జాబితా ప్రకటించాలని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదుగురు సూర్యనారాయణ ఎలక్ట్రోరల్ అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కార్యాలయంలో మాట్లాడుతూ బీఎల్ఓలు ఓటర్ల సమాచార సేకరణలో భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా వివరాలు సేకరించాలన్నారు. ఆన్లైన్ చేసిన ఓటర్ జాబితా పోలింగ్ బూత్ల వారీగా పది రోజులకు ఒకసారి ప్రకటించాలన్నారు. ఓటును ఆన్లైన్ చేసిన తర్వాత ఓటు పరిస్థితి తెలుసుకోవడానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అనుమానాలకు తావివ్వకుండా ఆన్లైన్ చేసిన ప్రతి ఓటును సంబంధిత పోలింగ్ బూత్ వద్ద పది రోజులకు ఒకసారి కచ్చితంగా వివరాలు ప్రకటించాలన్నారు. అక్కడక్కడ ఒక ఇంటి దగ్గర చేసి మిగిలిన కొన్ని ఇళ్ల వద్ద సమాచారం తీసుకోవటం లేదన్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. బీఎల్ఓలు చేస్తున్న ఈ ప్రక్రియను రెవెన్యూ శాఖలో ఎన్నికల విభాగం అన్ని స్థాయి అధికారులు సమీక్ష చేయాలన్నారు.


