ఉండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఆర్ధిక సహాయాన్ని రైతులు వ్యవసాయావసరాల కోసం వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహూల్కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషి విజ్ఞాన కేంద్రంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన, రైతులకు చెక్ అందజేత కార్యక్రమాలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,88,987 మంది రైతులకు రూ.68.93 కోట్లు అందజేసినట్లు తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఎన్జీ రంగా వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


