ద్వారకాతిరుమల: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య (రిటైర్డ్ ఐఏఎస్) శనివారం ఉదయం ద్వారకాతిరుమల క్షేత్రంలో పర్యటించారు. ముందుగా ఆయన సతీసమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆ తరువాత కృష్ణయ్య కొండపైన దేవస్థానం గోసంరక్షణశాలను, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గోబర్ధన్ 1.0 టీపీడీ సామర్థ్యం గల ప్లాంట్ను పరిశీలించారు. అలాగే కేశఖండనశాలలో వినియోగించిన వ్యర్థ జలాలను కొమ్ముగూడెంలోని దేవస్థానం తోటల్లో వినియోగిస్తున్న విధానాన్ని, అన్నదానానికి ఉపయోగించిన కూరగాయలు, ఆకుల వ్యర్థాలతో 500 కిలోల సామర్థ్యం గల స్మార్ట్ కంపోస్టింగ్ యంత్రం ద్వారా ఎరువు తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతిరుపతి క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణలో దేవస్థానం తీసుకుంటున్న చర్యలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ విధానాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ డీవీ భాస్కర్లకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ ఐ.రమణరాజు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ తదితరులున్నారు.


