తాడేపల్లిగూడెం: విద్యార్థులు సమాజ అవసరాలకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని జాతీయ జలజీవన్ మిషన్ డైరెక్టర్ అశోక్బాబు కోరారు. ఏపీ నిట్లో శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు. జలశక్తి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల గురించి విద్యార్థులకు తెలిపారు. జలవనరుల సంరక్షణ, సుస్థిర అభివృద్ధి , సాంకేతిక ఆవిష్కరణల ప్రాధాన్యంపై మాట్లాడారు. మల్టీచానల్ ట్యూబ్యులర్ సిరామిక్ మెంబ్రేన్ను ఆయన పరిశీలించారు. ఈ మెంబ్రేన్ను స్వదేశీ , తక్కువ వ్యయంతో లభించే ముడిపదార్థాలను ఉపయోగించి తయారుచేశామని కెమికల్ ఇంజనీరింగ్ అధిపతి వినోద్కుమార్రాజా తెలిపారు. దీంతో మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయవచ్చన్నారు. నీటిశుద్ధి, నీటి పునర్వియోగం, జలవనరుల సంరక్షణకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. నిట్ డీన్లు రవికిరణ్శాస్త్రి, వి.సందీప్ తదితరులు అశోక్బాబును సత్కరించారు.
భీమవరం: ప్రైవేట్, కార్పొరేట్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఫీజుల వివరాలు అందరిరికి కనిపించే విధంగా బోర్డులు పెట్టాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ అధ్యర్యంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేసే విద్యాసంస్థలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాలను అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పుస్తకాలు, విద్యాసామాగ్రి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ విద్యాశాఖ ఏడీ ఎన్ సత్యనారాయణకు వినతిపత్రాన్ని అందచేశారు.


