ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలు దాటినా హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు విమర్శించారు. పట్టణంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఇటీవల బడ్జెట్లో సామాజిక న్యాయం పూర్తిగా కొరవడిందన్నారు. ఏపీ బడ్జెట్ దాదాపు రూ.3 లక్షల కోట్లు అయినప్పటికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ద్రోహం జరిగిందని విమర్శించారు. ఎస్సీలకు రూ. 48 వేల కోట్లు, ఎస్టీలకు రూ.18 వేల కోట్లు, బీసీలకు రూ.1.5 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు పొట్ల విజయకుమారి, మరపట్ల రాజు, టి.యోహాను, ఎం.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: బత్తాయి, నిమ్మలో బ్రీడింగ్, జెన్టిక్స్, జినోమిక్స్ పద్ధతులను ఉపయోగించి వ్యాధి నిరోధక శక్తి కలిగిన కొత్త రకాలను అభివృద్ధి చేయడంపై మంగళవారం 27వ అంతర్జాతీయ సదస్సు ఆన్లైన్లో జరిగింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్ నుంచి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ చంద్రికా రామడుగు మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో బత్తాయి, నిమ్మ పంటలను ఆశించే సిట్రస్ గ్రీనింగ్ అనే వ్యాధి రైతులకు సవాలుగా మారిందన్నారు. ఈ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి సదస్సులో చర్చించారు. మొక్క బ్రీడింగ్ స్థాయిలో జెనెటికల్ మార్పులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా లైమ్ వంటి రకాలు తెగుళ్లు తట్టుకున్నట్టుగా డాక్టర్ చంద్రికా తెలియజేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉద్యాన వర్సిటీకి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఎంఓయూ ప్రయత్నాలు జరుగుతున్నాయని వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ సీహెచ్.రూత్ తెలిపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.మాధవి, పరిశోధనా సంచాలకులు డాక్టర్ రామానందం, యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ మధుమతి పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం


