దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
భీమడోలు: దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వృద్ధుడిని వ్యాన్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన బుధవారం జాతీయ రహదారి భీమడోలు వద్ద చోటు చేసుకుంది. భీమడోలు పంచాయతీ పరిధిలోని సూర్యారావుపేటకు చెందిన యర్రంశెట్టి నాగేశ్వరరావు(65) ఎంఎంపురం గ్రామంలో శ్రీపాండురంగ స్వామి వార్ల ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవానికి బుధవారం ఉదయం వెళ్లాడు. అక్కడ స్వామి వార్లను దర్శించుకుని తిరుగుపయనంలో పూళ్లలో బస్ ఎక్కి భీమడోలు వద్ద దిగాడు. రోడ్డు దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపుగా వెళ్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి ఆతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు యర్రంశెట్టి నాగశ్రీనివాస్ ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


