
వాహన తనిఖీలపై స్పెషల్ డ్రైవ్
భీమవరం (ప్రకాశంచౌక్) : కలెక్టర్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ చైర్పర్సన్ ఆదేశాల మేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్లు ధరించని వారిపై 32 కేసులు, సెల్ఫోన్ డ్రైవింగ్ 30 కేసులు, సీట్బెల్ట్ లేదని 28, ట్రిపుల్ రైడింగ్ 8, మోటార్ కార్కి ఫిలిం కలిగిన వాహనంపై 1 కేసు, నంబర్ ప్లేట్ లేదని 2, ఇన్సూరెన్సు లేనివి 3 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్లు లేని వారిపై 11 కేసులు నమోదు చేసి రూ.2,46,800 అపరాధ రుసుము విధించారు. వాహన తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా 10 మంది అధికారులు పాల్గొన్నారు.
డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్
పాలకోడేరు: పాలకోడేరు సచివాలయం –1 కి చెందిన డిజిటల్ అసిస్టెంట్ రవి నవనీత్కుమార్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీకి సంబంధించిన రూ.75,994 ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా నవనీత్కుమార్ తన అవసరానికి వాడుకున్నట్లు నిరూపణ కావడంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉల్లంఘన చట్టం అండర్ ఏపీసీఎస్ (సీసీ అండ్ ఎ) రూల్స్ 1991 ప్రకారం సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినట్లు ఎంపీడీవో వి.రెడ్డియ్య తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సంబంధిత ఉద్యోగి సస్పెన్షన్లోనే ఉంటాడని ఒక ప్రకటనలో తెలియజేశారు.
పెళ్లి వేడుకలో ఘర్షణ.. వ్యక్తి మృతి
నరసాపురం రూరల్: పెళ్లి వేడుకల్లో ఏర్పడిన ఘర్షణలో ఒక వ్యక్తి మృతి చెందాడు. నరసాపురం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 16వ తేదీ రాత్రి మండలంలోని కొత్తనవరసపురం గ్రామంలో జరిగిన ఈద వారి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు వచ్చిన బంధువుల్లో మద్యం మత్తులో జవదాల విజయశేఖర్ (46)తో అదే గ్రామానికి చెందిన ఈద సునీల్ ఆనంద్, అతని తండ్రి మోహనరావు (పండు) మరికొంత మంది గొడవ పడ్డారు. దీంతో పెద్దలు వారికి సర్దిచెప్పి పంపించారు. కాసేపటికే మళ్లీ సునీల్ ఆనంద్, మరికొందరు వచ్చి విజయశేఖర్ను పొడిచి, తలపై బలంగా కొట్టడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం అర్ధరాత్రి విజయశేఖర్ మృతి చెందాడు. మృతుని భార్య జవదాల గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

వాహన తనిఖీలపై స్పెషల్ డ్రైవ్