వరంగల్ లీగల్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ వి.బి నిర్మలా గీతాంబ తెలిపారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయసేవా సదనం బిల్డింగ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 12న (శనివారం) జిల్లా కోర్టు, నర్సంపేట కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో రాజీపడదగిన క్రిమినల్, సివిల్, భూ తగాదాలు, మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులు, వివాహ, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్, చెక్ బౌన్స్, విద్యుత్, చిట్ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, తదితర కేసులను పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ న్యాయవాదులతో కలిసి కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చకిలం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ
సెప్టెంబర్ 12న లోక్ అదాలత్


