భీమదేవరపల్లి: సంక్షేమం, అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన మండలంలోని ముత్తారం, గొల్లపల్లి, ముస్తఫాపూర్, వీరభద్రనగర్, గట్లనర్సింగాపూర్, బుల్లోనిపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ముత్తారంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి.. ముత్తారం చౌరస్తా నుంచి గట్లనర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గొల్లపల్లిలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి త్వరలోనే నీళ్లు నింపే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త పెన్షన్ల కోసం అర్హులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ గురవయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సత్యనారాయణరెడ్డి, ఉద్యానశాఖ అధికారి కమలాకర్రెడ్డి, సర్పంచ్లు ఊరడి భారతి జైపాల్ రెడ్డి, నేతుల చంద్రమోహన్, గడ్డం సుజాత రఘుపతిరెడ్డి, కొర్ర గోపాల్, బొల్లంపల్లి అజయ్ కుమార్, బొల్లి మానస, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కేతిరి లక్ష్మారెడ్డి, వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, వీరన్న, శ్రీకాంత్ ఉన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తిచేస్తాం
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


