‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చిమోశాను’ అని శ్రీశ్రీ చెప్పినట్లుగా పల్లెలు సైతం దేశాభివృద్ధిలో భాగమవుతున్నాయి. గ్రామస్తులకు మౌలిక వసతులు, ఆహ్లాదకర వాతావరణం, చక్కని జీవనాన్ని అందిస్తూ ఆదర్శప్రాయమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలకు ఏటా అందించే అచీవర్ అవార్డుకు జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. వెల్లివిరిస్తున్న ఆ పల్లెల అభివృద్ధి పథంపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
స్వచ్ఛత నిండా.. నారాయణతండా
దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నారాయణతండా గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు అంశాల్లో ప్రతిభ చూపిన గ్రామాలను ఎంపిక చేసింది. పరిశుభ్రత – స్వచ్ఛత – పచ్చదనం అంశంపై నారాయణ తండా 95.71 శాతం గ్రేడ్ పాయింట్లు సాధించి కేంద్ర అచీవర్ అవార్డుకు ఎంపికై ంది. తండాలో 702 జనాభా, 252 కుటుంబాలు, 553 మంది ఓటర్లు ఉన్నారు. 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో వీధుల వెంట వివిధ రకాల మొక్కలు నాటారు. వీటితో పాటు ఇళ్ల పరిసరాల్లో నాటిన మామిడి, జామ, నిమ్మ, వేప, మునగ చెట్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గ్రామంలో రోజూ తడి, పొడి చెత్తను వేరు చేస్తూ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఉదయమే తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తారు. ప్రధాన వీధులను ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తారు. పారిశుద్ధ్య పనులకు అవసరం ఉంటే తాత్కాలికంగా కూలీలను నియమించుకుంటారు. సర్పంచ్ పదవీ కాలం ముగిసిన తర్వాత రెండేళ్లపాటు కొనసాగిన ప్రత్యేక అధికారి, గ్రామస్తులు పచ్చదనంపై దృష్టి సారించడంతో జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
చెన్నారావుపేటలో కలిసి ఉన్న గ్రామం..
చెన్నారావుపేట మండల కేంద్రంలో పాత ముగ్ధుంపురం గ్రామపంచాయతీ ఎక్కువగా కలిసి ఉంటుంది. పలుమార్లు ఈ గ్రామాన్ని చెన్నారావుపేట గ్రామ పంచాయతీలో విలీనం చేయాలని, ప్రజలు కోరారు. కానీ, నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ పరిధిలోనే కొనసాగిస్తూ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అనంతరం మార్పులు చేర్పులతో ఏ మండలంలో ఉండే వారు ఆ మండలంలోనే కొనసాగుతూ వచ్చారు.
అచీవర్ అవార్డుకు జిల్లాలోని
రెండు గ్రామ పంచాయతీలు
పరిశుభ్రత, పచ్చదనం, స్వచ్ఛత
అంశాల్లో ఎంపిక చేసిన కేంద్రం
ఆదర్శంగా నిలుస్తున్న పల్లెలు


