రేపటి నుంచి కొమ్మాలలో బ్రహ్మోత్సవాలు
● 27న లక్ష్మీనృసింహస్వామి కల్యాణం
● మార్చి 3వ తేదీ రాత్రి నుంచి జాతర, 7న రథోత్సవం
గీసుకొండ: జిల్లాలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి మార్చి 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు అధ్యయనోత్సవం ప్రారంభం, 24న సాయంత్రం ప్రబంధ సేవాకాలం, 25న రాత్రి పరమపదోత్సవం, 26న అంకురారోహణం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, అగ్ని ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, ఈఓ ప్రసాద్ తెలిపారు. 27న రాత్రి 10 గంటలకు అమ్మవార్లు శ్రీదేవి, భూదేవితో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 28 నుంచి మార్చి 2 వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని చెప్పారు. మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని మూసి వేస్తామని, రాత్రి 8 గంటల తర్వాత జాతర, బండ్లు తిరగడం, దర్శనాలు ఉంటాయని వివరించారు. మార్చి 7న స్వామివారి రథోత్సవం, ఉగాది వరకు జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఆలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు..
● గుట్టచుట్టూ మూడు చోట్ల మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం. ఒక్కోదానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షలతో పనులు పూర్తి.
● రూ.25 లక్షల నిధులతో గుట్టవద్ద సైడ్ కాల్వలు, రోడ్లకు మొరం పోసి చదును చేసే పనులు చేపట్టారు.
● ప్రస్తుతం రూ.1.45 కోట్ల నిధులతో 800 మీటర్ల పొడవులో ప్రధాన రహదారి విస్తరణ, నిర్మాణం.
● రూ.10 లక్షలతో గుట్ట చుట్టూ ప్రభబండ్లు తిరగడానికి 30 అడుగుల వెడల్పుతో సుమారు 350 మీటర్ల మేర మొరం పోసే పనులు కొనసాగుతున్నాయి.
● రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఆలయ ప్రధాన మండపం విస్తరణ, నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు చేశారు. మంజూరు ఉత్తర్వులు గత సెప్టెంబర్ 28న వెలువడగా పనులు చేపట్టాల్సి ఉంది.
ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు..
● గుట్టచుట్టూ మాడవీధుల తరహాలో రూ.2 కోట్ల నియోజకవర్గ రూరల్ రోడ్స్(సీఆర్ఆర్) నిధులతో రింగ్రోడ్డు నిర్మాణం.
● గుట్ట నుంచి నాచినపల్లి రోడ్డును 600 మీటర్ల మేర నిర్మించడానికి రూ.కోటి నిధుల మంజూరుకు ప్రతిపాదన.
● భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్లు, వసతిగృహాల నిర్మాణం, కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలి. ఆలయ అభివృద్ధి కోసం మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు.
నిధుల దుర్వినియోగంపై డీపీఓకు ఫిర్యాదు
దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారని సర్పంచ్ పెండ్యాల రాజు డీపీఓ కల్ప నకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ముక్కెర ఆనంద్ రూ.3.90 లక్షల నిధులను పంచాయతీ సాధారణ నిధికి జమ చేయలేదని పేర్కొన్నారు. 4 సెప్టెంబర్ 2025 వరకు నాచినపల్లి కార్యదర్శిగా పనిచేసి డిప్యుటేషన్పై చింతలపల్లికి వెళ్లాడన్నారు. ఇప్పటివరకు నిధులు జమచేయలేదని, అతడిపై చర్య తీసుకోవాలని ఆయన వినతిపత్రంలో కోరారు.


