లచ్చమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి
● కేఏఎన్పీఎస్ కన్వీనర్ లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షురాలు సరోజన
కమలాపూర్ : ఇంటిబాట పునరుద్ధరణ కోసం ప్రాణత్యాగం చేసిన మొగిలిచెర్ల లచ్చమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి (కేఏఎన్పీఎస్) ఆల్ ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన డిమాండ్ చేశారు. తమ ఇంటి బాటను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ లచ్చమ్మ కుటుంబ సభ్యులు చేపట్టిన రిలే దీక్షలు 75వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చలో కమలాపూర్ పిలుపులో భాగంగా ఆదివారం న్యాయపోరాట కమిటీ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లచ్చమ్మ ఇంటి బాటను కబ్జా చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొగిలిచెర్ల భిక్షపతిని వెంటనే సస్పెండ్ చేయాలని, లచ్చమ్మ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం లచ్చమ్మ కుటుంబ సభ్యులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కార్యక్రమంలో ట్రైబల్ డెమొక్రటిక్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు పోరిక ఉదయ్సింగ్, గిరిజన మహిళా సంఘం నాయకురాలు సునీత, నాయకులు మోహనకృష్ణ, బండారి మల్లేశ్, రాజు, గుండె ప్రమోద్, జె.చక్రవర్తి, మొగిలిచెర్ల విలాస్, శిరీష పాల్గొన్నారు.


