సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
ఎంజీఎం: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆర్బీఎస్కే బృందాల వైద్యాధికారులు, సిబ్బందితో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ పీహెచ్సీ, డైక్ సెంటర్కు రెఫర్ చేసే విద్యార్థుల వివరాలను వేర్వేరుగా రిజిస్టర్లలో నమోదు చేయాలని, అలాగే పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు పరీక్షల నిమిత్తం వెళ్లేప్పుడు ఒకరోజు ముందుగానే వారికి సమాచారం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన తీవ్ర పోషణ లోపం, మధ్యమస్థాయి పోషణ లోపం ఉన్న పిల్లలకు అసెస్మెంట్ నిర్వహించి ఫాలో చేయాలన్నారు. ఈ సంవత్సరం 2,163 మంది పిల్లలను డైక్ సెంటర్కు రెఫర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆర్బీఎస్కే వైద్యులు దుర్గాప్రసాద్, కుమారస్వామి, రవీందర్, కవిత, ప్రతాప్రెడ్డి, ప్రణతి, మధు, క్రాంతికుమారి, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 17 నుంచి 23వ వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరం (నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపు)లో కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి, ఎన్ఎస్ఎస్ వలంటీర్ బాలంకి కార్తికేయ పాల్గొననున్నట్లు ప్రిన్సిపాల్ ఆచార్య ఎన్.రమణ తెలిపారు.
హన్మకొండ కల్చరల్: వరంగల్కు చెందిన కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళి రాసిన కథాసంపుటి ‘నిర్వాణ’ ప్రథమ బహుమతికి ఎంపికై ంది. విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో నిర్వాణ కథాసంపుటికి ప్రథమ బహుమతి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సాహితీవేత్తలు రామా చంద్రమౌళిని శనివారం అభినందించారు.


