
వారాహి రుద్రుడిగా శ్రీరుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని వారాహి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మలు ఉదయం నుంచి సుప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి అభిషేక, అర్చన, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, అర్చన జరిపారు.
‘విద్యుత్ ప్రమాదాలపై
జాగ్రత్త వహించాలి’
హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్ఈలు కె.గౌతం రెడ్డి, మధుసూదన్రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరి జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వైర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ఇళ్లలో విద్యుత్ సరఫరా కాని ప్లాస్టిక్ దండాల(దుస్తులు ఆరేసుకునేవి)ను ఉపయోగించాలని కోరారు.
స్పోర్ట్స్ స్కూల్లో
ప్రవేశాలకు మరో అవకాశం
వరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో గల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సాట్ మరో అవకాశం కల్పించినట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2016, సెప్టెంబర్ 01 నుంచి 2017, ఆగస్టు 31 మధ్యలో జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు.
లేబర్ కోర్టు ఏజీపీగా
రమణారెడ్డి
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నూకల వెంకటరమణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఐనవోలు మండలం పంఽథినికి చెందిన రమణారెడ్డి 1993లో న్యాయశాస్త్ర పట్టభద్రుడై సీనియర్ న్యాయవాది శివరావు వద్ద జూనియర్గా పనిచేశారు. 2006లో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జిల్లాలో పారిశ్రామిక, కార్మిక వివాదాల్లో ప్రభుత్వ పక్షాన రమణారెడ్డి వాదిస్తారు. ఈస్థానంలో ఆయన మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో
అధికార పార్టీ కార్పొరేటర్?
నకిలీ నోట్ల చలామణి కేసులో..
వరంగల్ క్రైం: నకిలీ నోట్ల చలామణిలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ కార్పొరేటర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలోనే సదరు కా ర్పొరేటర్పై కేసులు నమోదైనట్లు తెలిసింది. వారం రోజులనుంచి స్థానికంగా లేడని, దీంతో ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ కార్పొరేటర్ను పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు ప్రకటించే అవకాశం ఉంది.

వారాహి రుద్రుడిగా శ్రీరుద్రేశ్వరస్వామి