
భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండల కేంద్రంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. గత కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ చలాన్ కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఏసీబీ డీజీ విజయ్కుమార్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో నలుగురు డాక్యుమెంట్రైటర్ల నుంచి రూ.96,870 నగదు స్వాధీన పర్చుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 2023–24 సంవత్సరానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్ రైటర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, సబ్రిజిస్ట్రార్ కిషన్ నాయక్ ఆదేశాల మేరకే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, నేరుగా కార్యాలయం లోపలికి వస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. డాక్యుమెంట్ రిసీవింగ్లో రిజిస్టేషన్ చేయించిన వారిపేర్లు నమోదు చేస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా చలాన్ (రుసుం) కన్నా అధిక డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. తనిఖీల్లో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
డాక్యుమెంట్ రైటర్ల వద్ద లభించిన రూ.96వేల నగదు స్వాధీనం

భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీ