
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలో భూసేకరణ, చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని జాతీయ రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన భూ సేకరణ, సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపులు, వాటి పురోగతిపై సమీక్షించారు. జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పరిహారం, రైతులకు ఎంత చెల్లించారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూభారతి దరఖాస్తులపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్ చేసినవి, ఎన్నింటికి నోటీసులు ఇచ్చారనే అంశాలను ఆర్డీఓలు, తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, హైవే, గౌరవెల్లి ప్రాజెక్ట్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
విద్యార్థుల నమోదు పెరగాలి
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదుపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎంఈఓలతో సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు సమాచారాన్ని డీఈఓ వాసంతి, ఇంటర్ విద్యాశాఖ సూపరింటెండెంట్ చంద్రమౌళి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, పిల్ల లకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, యూనిఫామ్స్ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, ఏఎస్సీ రఘు చంద్రరావు, ఎంఈఓలు, సంక్షేమ అధికారులు, సీడీపీఓలు పాల్గొన్నారు.