పాలనలో తనదైన మార్క్‌ | - | Sakshi
Sakshi News home page

పాలనలో తనదైన మార్క్‌

Jun 16 2025 5:08 AM | Updated on Jun 16 2025 5:08 AM

పాలనలో తనదైన మార్క్‌

పాలనలో తనదైన మార్క్‌

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూనే.. ప్రాధాన్యం కలిగిన విద్య, వైద్యంతోపాటు ఉమ్మడి వరంగల్‌ వాసుల ఏళ్లనాటి కల మామునూరు విమానాశ్రయ పనులు ముందుకు తీసుకెళ్లడంలో కలెక్టర్‌ సత్యశారద తన మార్క్‌ చూపెడుతున్నారు. కలెక్టర్‌గా ఆమె సోమవారం నాటికి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తికానుంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గురుకుల పాఠశాలల్లో ‘ఫిర్యాదుల పెట్టె’లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గురుకులాలను సందర్శించిన సమయంలో ఫిర్యాదుల పెట్టెలను తెరిచి విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈకార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు వచ్చాయి. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచారు. అలాగే, గ్రీవెన్స్‌కు వచ్చే సీనియర్‌ సిటిజన్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన ప్రపంచ అందాల భామల పర్యటన విజయవంతమయ్యేలా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేశారు. చారిత్రక వరంగల్‌ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటేలా పర్యవేక్షించారు.

పలు అంశాల్లో ప్రత్యేక చొరవ..

● కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సత్యశారద తొలి రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఎంజీఎంపై దృష్టిసారించారు. డుమ్మా కొట్టే వైద్యులకు అప్పటి సూపరింటెండెంట్‌ వి.చంద్రశేఖర్‌ ద్వారా నోటీసులు కూడా ఇప్పించారు. రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరు నర్సుల తీరు కూడా మార్చుకోవాలని ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించారు.

● ఉమ్మడి వరంగల్‌ వాసుల ఏళ్లనాటి కల నెరవేర్చే దిశగా కలెక్టర్‌ అడుగులు వేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే మామునూరు విమానాశ్రయం కోసం అవసరమయ్యే అదనపు 253 ఎకరాల భూసేకరణ సర్వేను పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో చేయించారు. భూనిర్వాసితులను ఒప్పించడంలో ఆమె విజయవంతమయ్యారని కలెక్టరేట్‌ వర్గాలంటున్నాయి. అలాగే, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూనిర్వాసితులతో సమీక్షలు చేస్తూ భూసేకరణ కొలిక్కి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

● కలెక్టర్‌గా రాకముందు సీసీఎల్‌ఏలో పనిచేసిన అనుభవం ఉండడంతో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. భూభారతి సదస్సుల్లో స్వయంగా పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు.

● వరంగల్‌ బస్టాండ్‌తో పాటు జిల్లా సమీకృత కలెక్టరేట్‌ పనుల్లో వేగం పెంచాలని ఇప్పటికే అధికారులను పలుమార్లు ఆదేశించారు.

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది

ఎంజీఎంలో మెరుగైన వైద్యసేవలకు ప్రత్యేక చొరవ

మామునూరు విమానాశ్రయం

ముందుకెళ్లేలా చర్యలు

ఫిర్యాదుల పెట్టెలతో విద్యార్థుల

సమస్యల పరిష్కారానికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement