
మరుగుదొడ్ల అక్రమాలపై విచారణ
కమలాపూర్ : వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు అందిన ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది మంగళవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 2016 నుంచి 2019 వరకు మొత్తం 562 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం చేయలేదని, కొందరికి రూ.6 వేలు ఇచ్చి మిగతా రూ.6 వేలు చెల్లించకుండా అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల సంతకాలు ఫోర్జరీ చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు కమలాపూర్కు చెందిన పుల్ల అన్వేష్ ఫిర్యాదు చేశాడు. వందశాతం మరుగుదొడ్లు పూర్తయ్యాయని అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందజేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించాడు. దీనిపై క్షేత్రస్థాయి విచారణ చేసి దోచుకున్న సొమ్మంతా రికవరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్తో పాటు జిల్లా అధికారులకు గతేడాది ఫిర్యాదు చేశాడు. అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్డీఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది కమలాపూర్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరైందా? మంజూరైతే నిర్మించుకున్నారా? నిర్మించుకుంటే డబ్బులు వచ్చాయా? వస్తే ఎన్ని ముట్టాయి? తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాక విచారణ నివేదికను డీఆర్డీఓతో పాటు కలెక్టర్కు అందజేస్తామని డీఆర్డీఓ కార్యాలయ ఏఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.