దత్తత దందాపై టాస్క్‌‘ఫోర్స్‌’ | - | Sakshi
Sakshi News home page

దత్తత దందాపై టాస్క్‌‘ఫోర్స్‌’

Jun 19 2025 3:51 AM | Updated on Jun 19 2025 3:51 AM

దత్తత దందాపై టాస్క్‌‘ఫోర్స్‌’

దత్తత దందాపై టాస్క్‌‘ఫోర్స్‌’

సాక్షి, వరంగల్‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘సాక్షి’లో ప్రచురితమైన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దృష్టి సారించారు. తక్కువ వయసున్న పిల్లలను పొందడానికి ఎక్కువ వయసున్న దంపతులను తక్కువ వయసుగా చూపించేందుకు వివిధ ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఎనిమిది మంది పొందిన బర్త్‌ సర్టిఫికెట్లు నకిలీవని జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ధారించడంతో ఈ రాకెట్‌ వెనుక ఎవరున్నారనే వివరాలు పూర్తిస్థాయిలో తెలుసుకునే దిశగా విచారణ ముమ్మరం చేశారు. ఈ మేరకు హనుమకొండ బాలసముద్రంలోని బాలరక్షాభవన్‌లో బాలల సంరక్షణ విభాగాధికారులను టాస్క్‌ఫో ర్స్‌ పోలీసులు విచారించి, దత్తతకు సమర్పించిన పత్రాలు సేకరించినట్లుగా తెలిసింది. సెలవులో ఉన్న జిల్లా సంక్షేమ విభాగాధికారి రాగానే గురువారం ఆమె సమక్షంలోనే పోలీసుల విచారణ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ విభాగాధికారి, బాలల సంరక్షణ విభాగాధికారి సమక్షంలో వరంగల్‌ కలెక్టరేట్‌లో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన దత్తత కోరే జంటలతోపాటు ఆయా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని భావించిన పాఠశాల నిర్వాహకులను పిలిచి విచారించారు. అయితే చాలా మంది పాఠశాలల నిర్వాహకులు ఆ సర్టిఫి కెట్లు తామివ్వలేదని చెప్పారు. దీంతోపాటు గతంలోనే సదరు సర్టిఫికెట్లు సృష్టించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఆర్వోను కోరారు. అలాగే తాము చదవుకున్నా కూడా ఓ అధికారి తమ వద్ద డబ్బులు తీసుకొని సదరు పత్రాలు తెప్పించారని, తక్కువ వయసున్న పిల్లలు వచ్చేలా చూస్తామని చెప్పారని దత్తతకు దరఖాస్తు చేసుకున్న ఓ జంట డీఆర్వో ఎదుట అంగీకరించడంతో నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టైనట్లుగా తెలిసింది. మరో ఆరుగురు పిల్లల దత్తతను కోరేవారినీ విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.

మూడేళ్ల డేటాపై కసరత్తు..

తాజాగా ఎనిమిది మంది నకిలీ బర్త్‌డే సర్టిఫికెట్లు సమర్పించారని విద్యాశాఖ ధ్రువీకరించడంతో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయనే దిశగా జిల్లా సంక్షేమ విభాగాధికారులు దృష్టి సారించారు. కలెక్టర్‌ సత్యశారద ఆదేశాలతో గత మూడేళ్లకు సంబంధించిన దత్తత రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించడం, పాఠశాలల నుంచి నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు జారీ తదితరాలపై పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు. దత్తత అనుబంధ విభాగమైన శిశు గృహలోని సిబ్బంది సదరు పత్రాలు ఈ దత్తత దందాను విచారిస్తున్న డీఆర్వోకు అప్పగించనున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇందులో కూడా భారీగా అదే పాఠశాలల నుంచి నకిలీ బర్త్‌ సర్టిఫికెట్లు వస్తే ఈ కేసు మరింత కీలకంగా మారనుంది. ఇప్పటికే ఎనిమిది నకిలీ సర్టిఫికెట్ల సృష్టించినవారిపై పోలీసులు క్రిమినల్‌ చర్యలు తీసుకోనున్నారు. మిగిలిన జిల్లాలోనూ ఈ ఘటనలున్నాయా.. అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు చేసే దిశగా పోలీసుల విచారణ

ఇప్పటికే ఎనిమిది నకిలీవని

నిర్ధారించిన విద్యాశాఖ

బాలరక్షా భవన్‌ సిబ్బందిని

విచారించిన పోలీసులు

బాధ్యులైనవారిపై క్రిమినల్‌

చర్యల దిశగా అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement