నాడు అన్న.. నేడు తమ్ముడు | - | Sakshi
Sakshi News home page

నాడు అన్న.. నేడు తమ్ముడు

Jun 19 2025 3:51 AM | Updated on Jun 19 2025 3:51 AM

నాడు

నాడు అన్న.. నేడు తమ్ముడు

ఉద్యమంలో ముగిసిన గాజర్ల కుటుంబ ప్రస్థానం

భూపాలపల్లి/టేకుమట్ల: వెలిశాల తల్లడిల్లింది. ఈ ప్రాంతంలో నక్సల్స్‌ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో మరొకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 2008లో గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోగా, తాజా గా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన తమ్ముడు రవి అలియాస్‌ గణేష్‌ మృతిచెందాడు. దీంతో మావోయిస్టు ఉద్యమంలో గాజర్ల కుటుంబ ప్రస్థానం ముగిసినట్లయ్యింది. విషయం తెలియడంతో వెలిశాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యమాల బిడ్డ–నిను మరువదు పోరు గడ్డ అంటూ పలువురు ఉద్యమకారులు రవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఉద్యమానికి పురుడు పోసిన ఘటన..

వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య– కనకమ్మలకు ఐదుగురు కుమారులు రాజయ్య, సమ్మ య్య, సారయ్య, రవి, అశోక్‌. మల్లయ్య వ్యవసాయం, గౌడ కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. 1987లో గుమ్మడవెల్లి కో ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల్లో గాజర్ల సారయ్య చైర్మన్‌ బరిలో నిలిచి గెలుపొందాడు. అయినప్పటికీ అప్పటి పెత్తందారులు బ్యాలెట్‌ బాక్స్‌లను గల్లంతు చేసి ఓడినట్లుగా అధికారులతో ప్రకటింపజేశారు. దీంతో సారయ్య మందమర్రిలో ఉండే తన అన్న సమ్మయ్య దగ్గరికి వెళ్లి ఉపాధి కోసం చూస్తాడు. అక్కడ కూడా అతనిపై అక్రమ కేసులు మోపడంతో 1990లో పూర్తిస్థాయిలో నక్సల్స్‌ ఉద్యమంలోకి వెళ్లాడు. సారయ్య అలియాస్‌ ఆజాద్‌గా గుర్తింపు పొందాడు. ఆయన బాటలోకి గాజర్ల రవి, అశోక్‌ వెళ్లారు. 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సారయ్య అలియాస్‌ ఆజాద్‌ చనిపోయాడు. తాజాగా రవి కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందా డు. అశోక్‌ మాత్రం 2016లో పోలీసుల ఎదుట లొంగిపోయి, ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.

మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత రవి మృతి

33 ఏళ్ల క్రితం ఎర్రజెండా పట్టి

అజ్ఞాతంలోకి..

సెంట్రల్‌ కమిటీ సభ్యుడి

హోదాలో మరణం

వెలిశాలలో ముగిసిన అన్నల శకం

మూగబోయిన వెలిశాల..

ఎన్‌కౌంటర్‌లో రవి మృతి చెందిన విషయం తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నక్సల్స్‌ ఉద్యమానికి పురుడు పోసిన గాజర్ల కుటుంబంలో ఇద్దరు ఉద్యమకారులు నేలకొరిగారంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు రవితో గడిపిన సమయాలను నెమరువేసుకుంటున్నారు.

నేడు అంత్యక్రియలు...

ఎన్‌కౌంటర్‌లో రవి మృతి చెందాడని ఏపీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం గాజర్ల కుటుంబీకులకు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్న సమ్మయ్య, అశోక్‌(ఐతు)లు రవి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరి వెళ్లారు. గురువారం తెల్ల వారుజామున తిరిగి వెలిశాలకు వచ్చే అవకాశం ఉండగా, రవి అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి.

ఆపరేషన్లలో దిట్ట..

గాజర్ల రవి 1985–1986లో వరంగల్‌లో ఐటీఐ చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై స్టూడెంట్‌ యూనియన్‌లో పనిచేశాడు. తన అన్న సారయ్య అప్పటికే క్రియాశీలకంగా నక్సల్స్‌ ఉద్యమంలో పనిచేస్తుండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. దీంతో 1992లో ఉద్యమంలోకి వెళ్లిపోయాడు. పోలీసులపై దాడులు చేయడంలో దిట్టగా గాజర్ల రవి పేరొందాడు. ఆయన ఆపరేషన్‌ నిర్వహిస్తే ఫెయిల్‌ కాదన్న అభిప్రాయం ఉంది.

1994లో ప్రస్తుత జయశంకర్‌ జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ల్యాండ్‌మైన్‌ పేల్చి నలుగురు పోలీసులను చంపిన వారిలో రవి కీలకంగా వ్యవహరించాడు.

2001లో ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో ఉన్నాడు. ఇవే కాక పోలీసులు, గ్రేహౌండ్స్‌ బలగాలపై జరిపిన అనేక దాడుల్లో రవి కీలకంగా వ్యవహరించాడు.

2004లో మావోలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రవి కూడా ప్రతినిధిగా వ్యవహ రించాడు.

నాడు అన్న.. నేడు తమ్ముడు1
1/2

నాడు అన్న.. నేడు తమ్ముడు

నాడు అన్న.. నేడు తమ్ముడు2
2/2

నాడు అన్న.. నేడు తమ్ముడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement