బాధిత కుటుంబాలకు బాసట | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు బాసట

May 4 2026 7:01 AM | Updated on May 4 2026 7:01 AM

మరికల్‌: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్‌ఎఫ్‌బీఎస్‌) అమలు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు తహసీల్దార్‌ పరిధిలో ఉన్న ఈ పథకం బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులు ఇప్పటి నుంచి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇస్తే విచారణ, పరిశీలన, ఆమోద ప్రక్రియ వేగవంతం కానుంది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గతంలో దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలను కలెక్టర్లకు పంపితే నిధులు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో జాప్యం చోటుచేసుకునేది. ప్రస్తుతం లబ్ధిపొందే విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పుర, నగరపాలికల్లో కమిషనర్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని అప్పగించారు. ఇందుకు నిర్ధిష్ట గడువు కూడా విధించటంతో దరఖాస్తులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.

పది రోజుల్లో పరిశీలన

బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు జతచేసి ఎంపీడీఓ, పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందించిన పది రోజుల వ్యవధిలో అధికారులు విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలి. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో క్షేత్ర స్థాయి విచారణ లో జాప్యం చోటు చేసుకునేది. సమస్యను గుర్తించి న ప్రభుత్వం తాజా మార్పునకు నిర్ణయించటంతో వేగంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.

రూ. 20 వేల చొప్పున..

కుటుంబాన్ని పోషించే 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే వారు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో పురపాలికల్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి మంజూరుకు సిఫార్సు చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. 2017, ఏప్రిల్‌ 13 తర్వాత మరిణించిన వారి కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఎన్‌ఎఫ్‌బీఎస్‌ అమలు ఎంపీడీఓ చేతుల్లోకి..

కుటుంబ పెద్ద చనిపోతే రూ.20 వేల సాయం

అర్హులు సద్వినియోగం చేసుకోవాలి

జత చేయాల్సిన పత్రాలు

ఆహార భద్రత కార్డు

మృతుడి ఆధార్‌ కార్డు

మరణ ధ్రువీకరణ పత్రం

మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం

ఆదాయ ద్రువీకరణ పత్రం

కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం

దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా పుస్తకం

వీటన్నింటిని జతచేసి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ పత్రాలను స్థానిక సంస్థల కార్యాలయాల్లో అందించాలి.

Advertisement
 
Advertisement
Advertisement