వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరిగిన ప్రాంతాల్లో ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలని, మున్సిపల్ పాలక వర్గ సభ్యులందరూ సహకరించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. శనివారం మున్సిపల్ చైర్పర్సన్ మాధవి అధ్యక్షతను మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ అధికారులకు క్రమశిక్షణ కొరవడిందని, కనీసం ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వడం లేదని కౌన్సిలర్లు పితాంబర్, గంధం మదన్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధికి సంబంధించి ఫొటోలతో కూడిన సమాచారం అందిస్తేనే కౌన్సిల్ బిల్లులు ఆమోదిస్తుందని కౌన్సిలర్ పాకనాటి కృష్ణ స్పష్టం చేశారు. విలీన గ్రామాలకు జనరల్ ఫండ్ నిధులు కేటాయించొద్దనడం సరికాదని కౌన్సిలర్లు శరవంద, ముడావత్ శంకరమ్మ అన్నారు. చైర్పర్సన్ భర్త అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై కౌన్సిలర్ ధనలక్ష్మి అభ్యంతరం తెలిపారు. మున్సిపాలిటీ దుకాణాలకు సంబంధించి పన్నులపై సీపీఎం సభ్యుడు గంధం మదన్ ప్రశ్నించారు. తమ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్లు కౌన్సిల్కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషితోనే ఆస్తి పన్నుపై రాయితీ లభించిందని బీఆర్ఎస్ సభ్యుడు శ్రీకర్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.


