వనపర్తి: బాలల భద్రత, మత్తుకు అలవాటుపడ్డ వారిలో మార్పు, యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుంచి పారద్రోలడమే ముఖ్య ఉద్దేశమని డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అన్నారు. బాలల భద్రత, రక్షణ.. మాదక ద్రవ్యాల వ్యతిరేక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు భరోసా, ఏహెచ్టీయూ షీ–టీం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లింగ సమానత్వం, సమ్మతి, సైబర్ నేరాలు, యువతలో సురక్షిత ప్రవర్తన, సమస్యలు ఎదురైనప్పుడు ఫిర్యాదు చేసే విధానం తదితర వాటి గురించి వివరించారు. ప్రతి విద్యార్థి తన హక్కులు, బాధ్యతలు తెలుసుకొని సురక్షితంగా ఉండటం చాలా అవసరమన్నారు. సమాజంలోని మార్పులను అర్థం చేసుకొని సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలికలు, యువతులు ఏ సమస్య వచ్చినా భయపడకుండా వెంటనే పోలీసులు లేదా షీ–టీమ్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో హెచ్టీయూ ఎస్ఐ అంజద్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్ శిరీష, షీ–టీం సిబ్బంది, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


