వనపర్తి టౌన్: పదో తరగతి విద్యార్థులకు అత్యంత ముఖ్యమైందని, ఉన్నత చదువులకు నాందిగా నిలుస్తుందని డీఈఓ అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం సంగ్రహణాత్మక మూల్యాంకనం–2లో 500 పైగా మార్కులు సాధించిన, నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్–2026 పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హరిజనవాడ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను మెమోంట్లతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ గెలుపునకు ప్రయత్నిస్తూనే తోటి వారికి సహయపడాలని సూచించారు. పాఠశాల వయస్సులో విద్యార్థులు చురుగ్గా ఉంటారని, ఇప్పటి నుంచే లక్ష్యాలను ఎంచుకొని, వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. క్రమశిక్షణతోనే జీవితంలో ఏదైనా సాధించగలమని, క్రమశిక్షణ లేని గెలుపు జీవితంలో గౌరవాన్ని ఇవ్వదన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.చంద్రశేఖర్, 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు వాకిటి రవికుమార్, పాఠశాల చైర్మన్ యాదయ్య, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, శ్రీనివాసరావు, డీటీఎఫ్ అధ్యక్షుడు యోసేప్, గంధం నాగరాజు, ఉపాధ్యాయులు వెంకట రాములు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


